Nandyala: ప్రభుత్వం ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి
Nandyala: నలుగురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రిలోనే చికిత్స
Nandyala: ప్రభుత్వం ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి
Nandyala: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై ఓ పేషెంట్ కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారు. బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ పేషెంట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పేషెంట్ను చూడటానికి గ్రామానికి చెందిన పలువురు వచ్చారు. అయితే.. ఆస్పత్రి ఆవరణలోని మాతా శిశు కేంద్రం దగ్గర బైకును పార్కింగ్ చేస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. బైక్ పార్కింగ్ ఇక్కడ కాదని.. వేరే చోట చేసుకోవాలని సూచించారు.
దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు.. సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వాళ్లు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. నలుగురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలు కాగా... ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. మెడికో లీగల్ కేసు కింద ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల కోసం గాలిస్తున్నారు.