Pawan Kalyan: జన సేనాని జన్మదిన వేడుక‌ల్లో విషాదం.. జన సైనికుల మృతిపై స్పందించి పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడకల్లో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు లోని పవన్ అభిమానులు బ్యానర్‌లు కడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది

Update: 2020-09-01 17:31 GMT

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడకల్లో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు లోని పవన్ అభిమానులు బ్యానర్‌లు కడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది.  ఐదుగురికి  విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటన కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై  చోటుచేసుకుంది.

ప‌వ‌న్ తనకు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం ఇష్టం ఉండదని చెప్పినప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే పవర్‌స్టార్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు సన్నద్ధమవున్నారు. ఈ క్ర‌మంలో చిత్తూరు జిల్లాలోని శాంతిపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా ప్ర‌మాద‌శాత్తు  విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. షాక్‌ తగిలి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని  వెంటనే పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఉండడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

 ఈ ఘటనపై పవన్ కల్యాణ్ వెంటనే  స్పందించారు. గుండెల నిండా తన పట్ల అభిమానం నింపుకున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఇది మాటలకందని విషాదమని పేర్కొన్నారు జనసేనాని. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్న ఆయన... వారికి తానే ఇకపై బిడ్డగా నిలుస్తానని తెలిపారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను తానే ఆదుకుంటానని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. 

గాయపడిన మరో ముగ్గురు జనసైనికులకు మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు పవన్ కల్యాణ్. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన అభిమానుల కుటుంబాలకు అవసరమైన తక్షణ సాయం చేయాలని చిత్తూరు జిల్లా నాయకులను ఆయన కోరారు.



ఘటనపై నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, ఆర్ధిక సాయం అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Tags:    

Similar News