విభజన కష్టాలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఎప్పటిలాగానే, ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూసింది. కానీ మోడీ సర్కార్ ఉసూరుమనిపించింది. రాజధాని అమరావతి నిర్మాణం, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటు నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, కేంద్ర పథకాల నిధుల కేటాయింపులో కాస్త ఎక్కువ మొగ్గు చూపాలని కోరినా కేంద్రం కనికరించలేదు.
లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్లో ఏపీలో సాంకేతిక విద్య పట్ల కేంద్రం మొండిచెయ్యి చూపింది. మరోసారి చిన్నచూపు చూసింది. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి 13 కోట్ల రూపాయలు, ఏపీ ట్రైబల్ వర్సిటీకి 8కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు మాత్రం ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు. దీంతో వాటి నిర్వహణ భారం మొత్తం ఏపీ ప్రభుత్వంపై పడే అవకాశం లేకపోలేదు.
బడ్జెట్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు మొండిచేయి చూపిందని వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని విమర్శించారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు.
రెవెన్యూ లోటు, ఏపీకి ప్రధాన పోటు. ఏపీలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరినా కేంద్రం పెద్దగా స్పందించలేదు. అమరావతిలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకంగా సహాయం చేయాలని, అన్ని పరిశ్రమలకు వాటి ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వాలని విన్నవించుకున్నా మోడీ సర్కార్ పెడచెవిన పెట్టినట్టే కనిపించింది.
రాజధాని అమరావతి నిర్మాణానికి తాజా బడ్జెట్లో వెయ్యి కోట్లు ఇవ్వాలన్నది ఏపీ డిమాండ్. అమరావతి నుంచి అన్ని ప్రాంతాలకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా విశాఖ నుంచి అమరావతిని కలుపుతూ చెన్నై వరకు హైస్పీడ్ రైలు మార్గం, విజయవాడ, విశాఖపట్నంలో మెట్రోరైలు మార్గాన్ని నిర్మించేందుకు హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోలేదని ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆశల చిట్టా, న్యాయంగా దక్కాల్సిన విభజన చట్టం హామీల పద్దు, చాలానే ఉన్నా కేంద్రం మాత్రం మొండిచెయ్యే చూపించిందని విమర్శిస్తున్నారు.