Nimmagadda Ramesh reappointed: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ

Nimmagadda Ramesh reappointed; నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2020-07-31 01:43 GMT
Nimmagadda ramesh kumar (file photo)

ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియామకం చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు ఉత్తర్వులు మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ పేరుత ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు గెజిట్ విడుదల చేయాలని పీఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పునకు లోబడిగ పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తిరిగి రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది.

మరోవైపు హైకోర్టు తీర్పును అమలుచేయట్లేదంటూ నిమ్మగడ్డ కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా మరోసారి చుక్కెదురైంది. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో జరగబోయే పరిణామాలపై తదుపరి అఫిడవిట్ దాఖలు చేస్తామని నిమ్మగడ్డ తరఫు లాయర్ కోరగా, అందుకు సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది. ఇంతలోనే ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీగా రమేష్‌ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.

ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఎనిమిది నెలల్లో తన పదవి నుంచి దిగిపోతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు మరో ఆరునెలలు వరకూ జరిగే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నిలకు జరిపించాలన్నా రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రభుత్వ సహకారం అవసరం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. 

Tags:    

Similar News