గుండెపోటుతో నవ వధువు మృతి
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన దంపతుల జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంటుంది.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన దంపతుల జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంటుంది. కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాదకర ఘటనశ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిగిలిపల్లి వరలక్ష్మి కుమార్తె దమయంతికి తురలకకోటకు చెందిన గోపీనాథ్ సురేష్కు ఈ నెల 28వ తేదీగురువారం రాత్రి నందిగాం మండలం సుబ్బమ్మపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివాహం జరిగింది. దమయంతి శనివారం అత్తింట్లో అడుగుపెట్టాల్సి ఉంది.దీంతో కొత్తజీవితంపై కలలు కంటూ పుట్టింటినుంచి మెట్టినింటికి బయలుదేరింది.
ఈ క్రమంలో ఉదయం దమయంతికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కాళ్ల పారాణి ఆరకుండానే దమయంతికి నూరేళ్లు నిండిపోవడంతో కన్నవారు, అత్తింటి వారు తీవ్రంగా రోధించారు. అత్తింటి వారే దమయంతి కి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నవవధువు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.