అమరావతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్
అమరావతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(NFSU) క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు.
అమరావతి: అమరావతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(NFSU) క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు NFSU వైస్ చాన్సలర్ డాక్టర్ జేఎం వ్యాస్ తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం అమరావతిలో కేటాయించిన స్థలాన్ని విశ్వవిద్యాలయం బృందం పరిశీలించి, అంగీకారాన్ని తెలిపింది. అక్కడ శాశ్వత భవనాలు నిర్మించేందుకు NFSU సిద్ధమవుతోంది. త్వరలోనే తాత్కాలిక భవనాల్లో క్యాంపస్ ప్రారంభమవుతుందని వ్యాస్ చెప్పారు.
గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ పంచంలోనే ఏకైక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీ అంతర్జాతీయంగా ఇంటర్పోల్ గ్లోబల్ నెట్వర్క్ సహా 130కి పైగా సంస్థలతో అనుసంధానమైంది. 2009వ సంవత్సరంలో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ పేరుతో గాంధీనగర్లో దీన్ని ఏర్పాటు చేశారు. 2020లో కేంద్ర ప్రభుత్వం దీనిని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీగా అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ వర్సిటీకి అనుబంధంగా దేశంలో 15 క్యాంపస్లు, ఆఫ్రికాలోని ఉగాండాలో మరో క్యాంపస్ ఉన్నాయి.
90 దేశాలకు చెందిన పోలీసులకు NFSU శిక్షణ ఇస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 70 పీజీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి. పోలీసు, న్యాయ వ్యవస్థ, సాయుధ దళాలు, అకడమిక్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ తదితర రంగాల అధికారులకు ఈ వర్సిటీ స్వల్పకాలిక శిక్షణ ఇస్తోంది. దేశంలోని 3,000 వేల మంది పోలీసులకు సైబర్ భద్రతలో శిక్షణ ఇచ్చి సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దింది.సైబర్ ఫోరెన్సిక్స్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో NFSU శిక్షణ ఇస్తోంది.