Votes Counting: మొదలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ

Votes Counting: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యింది.

Update: 2021-09-19 02:43 GMT

ఏపీలో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 

Votes Counting: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని, 958 హళ్లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు అధికారులు. 13 జిల్లాల్లో ఐఏఎస్‌ అధికారులు పరిశీలకులుగా ఉన్నారు. కౌంటింగ్ హాళ్లలో సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. 10వేల 47 ఎంపీటీసీ స్థానాలకు వివిధ కారణాలతో 375 చోట్ల ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు. 9వేల 672 స్థానాలకు గాను 2వేల 371 చోట్ల ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే 81 మంది మృతి చెందగా.. 7వేల 220 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి.

660 జడ్పీటీసీ స్థానాలకు గాను 8 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 11 మంది అభ్యర్థులు మృతి చెందారు. 515 చోట్ల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2058 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

అర్ధరాత్రి దాటినా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి, విజేతలను ప్రకటిస్తారు. జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని కలెక్టర్లతో శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. కొవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన, రెండు డోసుల టీకా వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం అందజేసిన వారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియను సమీక్షించేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఈనెల 25లోగా జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. జడ్పీటీసీలంతా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లను, ఎంపీటీసీలంతా మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

Tags:    

Similar News