పోలవరం విషయంలో నిర్లక్ష్యం చేసిందెవరో ప్రజలకు తెలుసు : మంత్రి అనిల్

Update: 2020-10-26 08:01 GMT

పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందెవరో ప్రజలకు తెలుసని అన్నారు మంత్రి అనిల్‌. 2014లో అధికారం చేపట్టిన టీడీపీ.. రెండేళ్లపాటు పోలవరాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 2016లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని టీడీపీ స్వాగతించిందని.. ప్యాకేజీల కోసమే చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారని ఆరోపించారు మంత్రి అనిల్. ప్యాకేజీలో ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. 2014లో సవరించిన అంచనాలతో నిధులు విడుదల చేయాలని బాబు కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించలేమంటూ 2017లో కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది.

చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఈ రోజు కేంద్రం కొర్రీలు వేస్తోంది. టీడీపీ ఈ రోజు సిగ్గులేకుండా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు..?. ప్రతి సోమవారం పోలవరంలో చంద్రబాబు ఏం పరిశీలించారు..? లక్ష మంది నిరాశ్రయ కుటుంబాల గురించి ఎందుకు ఆలోచించలేదు..? ప్రాజెక్టు నిర్వాసితులను కచ్చితంగా ఆదుకోవాల్సిందే. ఈ విషయాలన్నింటిపైనా త్వరలో ప్రధాని మోదీని కూడా కలుస్తాం. ఆ మేరకు పోలవరంపై కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ కూడా రాస్తారు అని మంత్రి అనిల్‌ కుమార్‌ వెల్లడించారు.

Full View


Tags:    

Similar News