తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. ఈశాన్య భారతం నుంచి శీతల గాలులు వీస్తున్నందున అటు ఉదయం, ఇటు సాయంత్రం సమయాల్లో సాధారణం కన్నా 7 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలిగాలులతోపాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు.
తెలంగాణలో అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధరి గ్రామంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని కుభీర్లో 8.9 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్లో 9.4, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం భాగ్యనగర్ నందనవనం ప్రాంతంలో 9.8 డిగ్రీలు, జిన్నారంలో 9.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయి.
విశాఖ మన్యం చలికి గజగజ వణుకుతోంది. చింతపల్లిలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తోంది. గిరిజన గ్రామాల్లో ఉదయం పది గంటల వరకు మంచు వదలడం లేదు. దీంతో ప్రతి ఇంటా చలి మంటలు వెలుగుతున్నాయి. అటు డిసెంబర్, జనవరి నెలల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయంటున్నారు అధికారులు.