కర్నూలు జిల్లా దేవరగట్టులో టెన్షన్ టెన్షన్

Update: 2020-10-26 05:27 GMT

కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్‌ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై పోలీసులు నిషేధం విధించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో బన్నీ ఉత్సవంపై నిషేధం విధించినట్లు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

దసరా వచ్చిందంటే ఎక్కడైనా దుర్గమ్మ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో సమరం చేస్తారు. సంప్రదాయం పేరిట తలలు పగలగొట్టుకుంటారు. చేతులు విరగ్గొట్టుకుంటారు. కర్రల యుద్ధంలో ఎంతో మంది గాయపడుతారు. ఇప్పటివరకు కర్రల సమరంలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.

విజయదశమి రోజు దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి కోసం భీకర పోరు జరుగుతుంది. దీన్ని బన్ని ఉత్సవం అని పిలుస్తారు. చిమ్మ చీకటిలో దివిటీల వెలుగులో వేలాది మంది కర్రలతో హోరాహోరీగా తలపడుతారు. తలలు బద్దలు కొట్టుకుంటూ మాలమల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు ప్రాణాలను ఫణంగా పెడుతారు.

ఈ ఏడాది దేవరగట్టులో రక్తపాతాన్ని ఆపాలని పోలీసులు నిర్ణయించారు. కర్రలతో తలపడితే కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో బన్నీ ఉత్సవంపై నిషేధం విధించినట్లు ప్రకటించారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రద్దు చేశామన్నారు. ఇప్పటికే ఆలూరు, హోలగొంద, ఆస్పరి, మండలాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసుల నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కర్రల సమరం ఆపడం వల్ల రక్తపాతం ఆగిపోతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రతీ ఏటా జరిగే ఉత్సవాలను ఆపడం సరికాదని మరికొందరు అంటున్నారు.

Tags:    

Similar News