కియా మోటర్స్ నుంచి తొలి కారు రోడ్డెక్కింది. అనంతపురంలోని పెనుకొండ ప్లాంట్లో తయారైన కారును కియా ఎండీ, దక్షిణ కొరియా రాయబారి, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. పెనుకొండ ప్లాంట్లో కియా మోటార్స్ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కారును రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకర్ నారాయణ, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. 13,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి 6 నెలలకు కొత్త మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.
సెల్తోస్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, శ్రీధర్రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు. ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా సెల్తోస్ కారును మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం ప్రసంగించారు. అనంతపురం జిల్లాకు కియా ప్లాంట్ ఒక డైమండ్లాగా ఉండాలని ఆకాంక్షించారు.