ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో సారి పొత్తుల రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీతో జనసేన పొత్తు కలవడానికి సై అంటుంది. ఈ నేపథ్యంలోనే జనసేన, బీజేపీ నేతలు విజయవాడ వేదికగా ఈ రోజు సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇరు పార్టీల నేతలు ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశంకానున్నారు. సమావేశం అనంతరం కార్యకర్తలు మధ్యాహ్నం మూడు గంటలకు ఉమ్మడిగా ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, సునీల్ దేవధర్లు హాజరు కానున్నారు.
ఇదిలా ఉంటే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కలవడం కొత్తేమీ కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత వారమే ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక అవగాహనకు రావలన్న అంశాలపై వారితో చర్చించారు. దాంతో పార్టీ అధినేతలు ఓకే చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర నేతలతో విజయవాడలో భేటీ అవుతున్నారు. ఇదిలా ఉంటే 2014లో కూడా జనసేన బీజేపీ, టీడీపీలతో కలిసి పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే.