తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజక వర్గంలోని పెంటపాడు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. ఇప్పటి వరకూ వైసీపీకి చెందిన అభ్యర్థి ఆ పదవిలో ఉన్నారు. ఎంపీటీసీలు అవిశ్వాస ప్రకటించారు. దాంతో, ఎంపీటీసీలు జనసేన పార్టీకి చెందిన కట్టుబోయిన వెంకట లక్ష్మిని మండలాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆ పార్టీ నేతలు వెంకట లక్ష్మికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, “రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ అందిస్తున్న సేవలు ప్రతి ఒక్కరి మెప్పు పొందుతున్నాయి. గ్రామాల్లో రహదారుల కోసం రూ.2 వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 10 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, ప్రజా సేవలో నిమగ్నం కావాలని దిశానిర్దేశం చేసిన నాయకుడు పవన్ కల్యాణ్. ఆయన స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్తున్నాము. మా నాయకుడి విధానాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరుతున్నారు. ఈ రోజు పెంటపాడు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో జనసేన విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.’’ అని అన్నారు.