సీఎం జగన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఐటి గ్రిడ్స్ వ్యవహారం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఐటి గ్రిడ్స్ వ్యవహారం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజలకు సంబంధించి సమస్త సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఐటీ గ్రిడ్స్ కంపెనీ సిఇవో దాకవరపు అశోక్ పై కోర్టులో కేసు నడుస్తోంది. ఎస్ఆర్ నగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో పలు కీలక డాక్యూ మెంట్లు సహా ముఖ్యమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అశోక్ టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ ఆరోపించింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అశోక్ ను వెనకేసుకొచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు విచారణ నత్తనడకగా సాగుతోంది. గత ఆరు నెలల నుండి ఈ కేసు గురించి ఎటువంటి సమాచారం లేదు.
ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖతో ఐటీ గ్రిడ్స్ వ్యవరాహారం మళ్ళీ చర్చకు వచ్చింది. కన్నా లక్ష్మి నారాయణ ఈ కేసు విషయంలో సిఎం జగన్ కు లేఖ రాశారు. కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. ఇంతవరకు ఐటి గ్రిడ్స్ యజమాని అశోక్ను పోలీసులు ఎందుకు ప్రశ్నించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఆ సంస్థ 7 కోట్లకు పైగా వ్యక్తుల వ్యక్తిగత వివరాలు దొంగిలించబడిందని.. ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంది అని ప్రశ్నించారు కన్నా. దీనిపై దర్యాప్తు చేయాలని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు.