తమకు వైసీపీ ఎంపీలు కొందరు టచ్ లో ఉన్నారని బీజేపీ నాయకుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు మూకుమ్మడిగా తిప్పికొట్టారు. తమ పార్టీ ఎంపీలకు బీజేపీలో చేరవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై దాదాపు గంటపాటు సీఎంతో చర్చించారు రఘురామకృష్ణంరాజు. అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎంకు వివరణ ఇచ్చినట్టు స్పష్టం చేశారు.
అలాగే తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ఊహాగానాలకు కొట్టిపారేశారు. జగన్ తో తనకు ఫెవికాల్ బంధం ఉందని.. బీజేపీలో చేరాల్సిన అవసరం తనకు లేదన్నారు. సుజనా చౌదరి ఈ మాట ఎందుకన్నారో తనకు తెలియదని.. అసలు వైసీపీ ఎంపీలు ఎవరు టచ్ లో ఉన్నారో సుజనా చౌదరి పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతలతో నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై మాత్రమే చర్చిస్తామని.. రాజకీయంగా మాత్రం టచ్ లో లేమని తేల్చేశారు.