పదో తరగతి విద్యార్ధినిపై ఒంగోలులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ... హోంమంత్రి సుచరిత సీరియస్ అయ్యారు. తక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీని ఆమె ఆదేశించారు. ఘటన వివరాలు స్వయంగా తెలుసుకున్న హోంమంత్రి సుచరిత .. బాధితురాలికి మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన ... నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. మానవత్వమే సిగ్గుపడే ఇలాంటి ఘటనలను ఏ మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. కేసులో ఎవరి ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు .
అత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు ...బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. గుంటూరు జిల్లాలో పదో తరగతి చదువుతున్న బాలికకు స్ధానికంగా ఉన్న కారు డ్రైవర్తో ఏర్పడిన పరిచయంతోనే ఒంగోలు చేరుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వారం క్రితం ఇంట్లో నుంచి ఒంగోలు చేరుకున్న బాలిక ... బస్టాండ్లో ఉన్న బాజీ ఫోన్తో కారు డ్రైవర్కు పోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో ... బాజీ మాయ మాటలు నమ్మి మోసపోయినట్టు పోలీసుల దర్యాప్తలో వెలుగు చూసింది.
బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా బాజీతో పాటు అతని స్నేహితుడు శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ... పలు కీలకమైన సాక్షాధారాలను సేకరించారు. ఇంట్లో నలుగురు విద్యార్ధులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు .. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం సేకరించారు. నలుగురి ఫోన్ నెంబర్లతో పాటు బాజీ ఫోన్ కాల్ లిస్ట్ను పరిశీలించి ఇద్దరు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. పరారిలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు కావడంతో ఫోన్ నెంబర్ల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతన్నాయి. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. బాలిక తప్పిపోయినట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదంటూ విమర్శిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.