Andhra Pradesh: కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

Andhra Pradesh: నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2021-07-03 05:53 GMT

Heavy Rains in Coastal Districts

Andhra Pradesh: నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోకి పడమర దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కృష్ణా జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అనేక చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. నేడు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

శుక్రవారం ఆమదాలవలసలో 63.0 మి.మీ, శ్రీకాకుళంలో 17.75 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాలతో శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణం, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు పశ్చిమగోదావరి జిల్లాలోనూ గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని 23 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పెదవేగి మండలంలో 75.4 మిల్లీమీటర్లు వర్షపాతం రికార్డైంది. మరో వైపు కృష్ణా జిల్లా నూజివీడులో అత్యధికంగా 94.8 మి.మీ, విశాఖపట్నంలో 52.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags:    

Similar News