Anandaiah Medicine: ఆనందయ్య మందు పై నేడు తుది నివేదిక..ఆయుష్ కమిషనర్ రాములు
Anandaiah Medicine: ఆనందయ్య మందు పై తుది నివేదిక ఈ రోజు వెల్లడి కానుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు.
Anandayya...Ayush Commissioner Ramulu:(File Image)
Anandaiah Medicine: ఆనందయ్య మందు పై తుది నివేదిక ఈ రోజు వెల్లడి కానుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఈ మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఇప్పటికే మందుకు సంబంధించిన పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని ఆయన తెలిపారు.
నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందని చెప్పారు. డ్రగ్స్ లైసెన్స్ విషయంలో కూడా కమిటీ అధ్యయనం చేస్తోందని, కేంద్ర సంస్థ అధ్యయన కమిటీ నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు. నివేదికతోపాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అన్నింటినీ పరిగణలోకి తీసుకుని అంతిమ నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందు పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన నివేదికలు అన్ని పాజిటివ్గా వచ్చాయని పేర్కొన్నారు. మందుపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదని, ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే త్వరగా ప్రాసెస్ చేస్తామని అన్నారు.
ఆనందయ్య తయారు చేసిన మందును వైద్యులు కొట్టిపారేస్తున్నారు. ప్రజలు మూఢ నమ్మకాలు నమ్మొద్దని సూచించారు. కరోనా సమయంలో వైద్యులు సూచించిన మందులే వాడాలని సూచించారు. ఆనందయ్య మందు వాడినవారు ఇబ్బందులు పడుతున్నారని, కరోనాతో జనాలు బతుకుతున్నది డాక్టర్ల మెడిసిన్ వాడటం వల్లేనంటున్నారు. దీంతో ఆనందయ్య మందు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.