మూడు రాజధానులపై కేబినెట్ నిర్ణయంతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. పలుచోట్ల రైతులు ధర్నాలకు దిగారు. తమ ఇళ్ల నుంచి అసెంబ్లీ వైపు పరుగులు పెట్టారు. చెట్లు, గట్లు లెక్క చేయకుండా పంట కాల్వలను దాటుకుంటూ సచివాలయం రెండో గేటు వైపు దూసుకెళ్లారు. జాతీయ జెండాలు చేతబూని పోలీసు వలయాన్ని చేదించుకుని ముందుకు సాగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.
మందడం, వెలగపూడిలో నిరసన తెలిపిన రైతులు, మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన రైతులు పోలీసు వాహనంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు రైతులు రోడ్డుపై పడుకుని నిరసనకు చేపట్టారు. సీఎం జగన్ వెళ్లే కాన్వాయ్ దారిలో రోడ్డుపై బైఠాయించారు.