బీజేపీలోకి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి?

Update: 2019-08-18 15:18 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. మూడు సార్లు వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. అనంతరం మంత్రి పదవి పొందారు. అప్పటినుంచి వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.. దీంతో వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించిన ఆదికి చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. ఆయనను కాదని జమ్మలమడుగు టిక్కెట్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. దాంతో ఆదినారాయణరెడ్డి అయిష్టంగానే ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పత్తా లేకుండా పోయిన ఆది.. బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆదిని చేర్చుకునే విషయంపై బీజేపీ అధిష్టానం ఆచి తూచి వ్యవహరిస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీలోకి ఆయన చేరిక ఆలస్యం అవుతుందనే వాదన వినబడుతోంది.  

Tags:    

Similar News