ఏలూరులో క్రమంగా తగ్గుతున్న వింత జబ్బు కేసులు

Update: 2020-12-11 07:15 GMT

అంతుచిక్కని వ్యాధితో గజగజ వణుకుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు క్రమ క్రమంగా కోలుకుంటోంది. వ్యాధి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు 607 కేసులు నమోదుకాగా వారిలో 538 మంది వైద్యం తీసుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఇక మిగిలినవారంతా ఏలూరు, గుంటూరు, విజయవాడ ప్రభుత్వాస్పత్రులో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ వింత వ్యాధి బారిన పడి ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఓ వైపు కేసులు తగ్గుతున్నప్పటికీ రోగమేంటనేది మాత్రం అంతుచిక్కడంలేదు. శాంపిల్స్‌ టెస్టుల్లో వివిధ కారణాలు వెల్లడించినా ఇదే వ్యాధికి కారణమనే నిర్ధారణకు మాత్రం రాలేకపోతున్నారు. దీంతో వ్యాధిపై లోతుగా పరిశోధన ప్రారంభించింది ఢిల్లీ ఎయిమ్స్. మొత్తం 37 శాంపిల్స్‌ను విశ్లేషించగా 21 శాంపిల్స్‌లో అధిక మోతాదులో సీసం గుర్తించారు. మిగతా నమూనాల్లో సీసంతో పాటు నికెల్ వంటి లోహాలు గుర్తించారు. వీటితో పాటు ఆర్గానోక్లోరిన్స్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న ఎయిమ్స్.. పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ సాయం కోరింది.

ఇక ఏలూరు ఆస్పత్రిని సందర్శించిన సీఎస్ నీలం సాహ్ని బాధితులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఏలూరు వింతవ్యాధి ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వింత వ్యాధిపై కారణాలను తెలుసుకునేందుకు 21 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమించింది. కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, కన్వీనర్‌గా ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించింది. వింత వ్యాధికి గల కారణాలు అన్వేషించడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సూచనలు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. 

Tags:    

Similar News