శాసనసభలో సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలవరంపై అవాస్తవాలు చెబుతున్నారని టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొనగా, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఫొటోలు, శంకుస్థాపనలు తప్ప చేసిందేమీ లేదని అనిల్ ఎద్దేవా చేశారు. ' 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని సవాల్ విసిరిన నేతలు ఎక్కడున్నారు.. పోలవరంలో జరిగిన దోపిడీ గురించి వారెవరూ మాట్లడరేం ' అని అనిల్ ప్రశ్నించారు. పోలవరం నిధులు దోచుకుతిన్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చింది వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనేనని.. ఆ సమయంలో కాలువలు తవ్వకపోయి ఉంటే భూ సేకరణకు వేల కోట్ల రూపాయల భారం పడేదని అన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని జగన్ చెప్పారని పేర్కొన్నారు.