విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికే ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదనను తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. చదువు భారం కాకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఉన్నత చదువులతోనే పేదరికం నుంచి ముక్తి కలుగుతుందని జగన్ వెల్లడించారు.
పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని తొలి అడుగు వేశామన్నారు జగన్. ఇలాంటి మంచి కార్యక్రమం ఆపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. మన పాలన - మీ సూచన కార్యక్రమంలో భాగంగా విద్యా రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్లో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మ ఒడి, జగన్న విద్యా కానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్పై చర్చించారు. పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని చదువుల్లో ప్రాథమిక స్థాయి నుంచే మార్పు తీసుకోవాలన్నారు.
పేదరికం తొలగించడానికి ఏ పరిష్కారం లేదన్నారు ఏపీ సీఎం జగన్. చదువుతోనే పేదరికాన్ని తొలగించవచ్చన్నారు. ఇంగ్లీష్ మీడియం చదవాలని కోరిక ఉన్నా డబ్బులు పెట్టే స్థోమత లేక విద్యార్థులు ఆగిపోతున్నారన్నారు. అలాంటి వారికి చదువు భారం కాకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు సీఎం జగన్. ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే వారి సంఖ్య పెంచాలని కోరారు. ఆగస్టు 3న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని అదే రోజు జగనన్న విద్యా కానుక అందిస్తామని తెలిపారు. సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి బొత్స సత్యానారాయణ, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.