ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధిక ధరల విక్రయ నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 14500 టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు.
దీనిద్వారా అక్రమాలను అడ్డుకోవాలని సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలనీ చెప్పారు. కాగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించినా, పరిమితికి మించి ఎక్కువ ఇసుక కలిగి ఉన్నా వారికి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా రూ. 2 లక్షల వరకు జరిమానా విధించేలా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీనిని అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, టాస్క్ఫోర్స్ చీఫ్ సురేంద్ర బాబు తదితరులు హాజరయ్యారు.