కరువుకు నిలయమైన 'అనంత'లో వైఎస్సార్, పీఎం కిసాన్ రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి.. అర్హులైన రైతులకు సాయం దక్కేలా కృషిచేసిన కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు.మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర శాఖాధిపతులతో క్యాంపు కార్యాలయంలో కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై అందరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ..
జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేశామని ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు చేశామన్నారు. దీంతో అనంత కలెక్టర్ ను శభాష్ సత్యనారాయణ అంటూ ప్రత్యేకంగా అభిననందించారు.. రైతుభరోసా పథకంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగా చేశారని అన్నారు. వీడియా కాన్ఫరెన్స్లో అనంతపురం జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ వెంకటసుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, జెడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి, డీపీఓ రామనాథరెడ్డి పాల్గొన్నారు.