ప్రజలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి.. వలంటీర్లను సమర్థంగా ఉపయోగించుకోవాలి
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలోనూ ఈ మహమ్మరి ధాటికి 40పైగా మరణాలు సంభవించాయి. తెలుగు రాష్ట్రాలను ఈ మహమ్మరి వేగంగా వ్యాపిస్తోందని, ఇవాళ ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 17 కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని అన్నారు.
ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించాలని చంద్రబాబు కోరారు. కరోనా గురించి నిపుణులతో చర్చించానని, కరోనా సోకిన వ్యక్తి తాకిన వస్తువును మరొకరు తాకితే వ్యాధి వస్తుందని చెప్పారు. ఈ కోవిడ్ వల్ల ఇటలీలో 60 మంది వైద్యులు మరణించారని, రాష్ట్రంలో వైద్యులు, సిబ్బందిని చాలా జాగ్రత్తగా రోగులను చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి.. వారినీ ఇళ్లకే పంపిచండి
యని.. వాలంటీర్ల ద్వారా బియ్యం, పప్పులను ప్రజల ఇంటికే పంపించాలని కోరారు. ఇళ్ల వద్దకే పింఛన్లు కూడా తీసుకెళ్లి ఇవ్వాలన్నారు.
ఈ వైరస్ భయంతో అన్ని రంగాలపై ప్రభావం చూపిందని'' పరిశ్రమలు మూతపడ్డాయి. సేవారంగం, పౌల్ట్రీ రంగం బాగా దెబ్బతింది. వైద్యం విషయంలో అమెరికా, ఇటలీ లాంటి దేశాలే చేతులెత్తేశాయి. ఒక దశ దాటితే మనదేశంలోనూ వైద్యం అందించలేం. ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం'' అని చంద్రబాబు తెలిపారు. చైనాలోని వూహాన్లో కరోనా నుంచి బయటపడాలంటే 62 రోజుల లాక్డౌన్ పాటించారని, కనీసం 49 రోజుల లాక్డౌన్ పాటించాలని నిపుణులు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.
ఇప్పటికే పలు రకాల వ్యాధులు ఉన్నవారు కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి డిజిటల్ సోషలైజేషన్ జరగాలని లేదంటే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని, నివారణ చర్యలను స్లైడ్స్ ద్వారా వివరించారు.
మరోవైపు రైతులకు నష్టం వాటిల్లకుండా... మద్దతు ధరతో ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేయాలని కోరారు. చేపలు, రొయ్యల పెంపకం దారులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.అరటి రైతులు మామిడి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక ప్రజలు ప్రతి రోజు వేడినీటితో ఆవిరిపడితే ఆరోగ్యానికి మంచిదని చంద్రబాబు సూచించారు. తరచూ వేడి నీరు పుక్కిలించాలన్నారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. యోగా, వ్యాయామం, ఎండలో ఉండటం లాంటివి చేయాలని కోరారు.చేతులు శానిటైజ్ కడుకోవాలని ఆయన అన్నారు. సీ-విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.