విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు విహార యాత్రకు వెళ్తుండగా ఉడిపి సమీపంలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి బాబా ఫకృద్దీన్ మృతి చెందగా, 35 మంది విద్యార్థులు,11 మంది ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు అద్దాలు పగులుగొట్టి కొందరు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు ఉడిపి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంవో అధికారులు జగన్కు తెలిపారు. తక్షణమే సహాయకార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. గాయపడ్డవారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు చేపట్టాలన్నారు సీఎం జగన్.