వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినా ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం అమలు చేయలేక పోయిందంటూ ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు లేదంటూ వ్యాఖ్యానించారు. ఇసుక కొరతతో లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోలేదని కన్నా ఆరోపించారు. గతంలో జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందని అన్నారు. మార్పును కోరుకున్న ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నారని కన్నా చెప్పారు. జన్మభూమి కమిటీల పేర్లను మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చారని కన్నా అన్నారు. వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ సొంత పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని అన్నారు.