విజయవాడలో సమావేశమైన బీజేపీ, జనసేన సమన్వయ కమిటీ వివిధ కీలక అంశాలపై చర్చించింది. శాసన మండలి రద్దు నిర్ణయాన్ని ఇరు పార్టీల నేతలు ఖండించారు. రాజధాని విషయమై ఎటువంటి కార్యాచరణ చేపట్టాలనే విషయంపై కూడా ప్రధానంగా చర్చించారు. బీజేపీ, జనసేన ఉమ్మడిగా ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంతో పాటు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తు అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రాజధాని తరలింపుకు తాత్కాలికంగా బ్రేక్ పడిన నేపథ్యంలో ఇరుపార్టీలు సంయుక్తంగా చేపట్టదలిచిన లాంగ్మార్చ్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా తాము చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ,లాంగ్ మార్చ్ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాలను త్వరలో తెలియజేస్తామని ఇరు పార్టీల నేతలు తెలిపారు.