స్థానిక ఎన్నికల్లో పోటీపై జనసేన-బీజేపీ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఢిల్లీలో ఇరు పార్టీల నేతలు సమావేశమై చర్చించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ చర్చలు జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జీవీఎల్ స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ, పురందేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పలువురు బీజీగా ఉన్నారని తెలిపారు. వారితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపినట్లు జీవీఎల్ వెల్లడించారు. మార్చి 8న ఆదివారం మరోసారి విజయవాడలో సమావేశమై ఎక్కడ ఎవరెవరు పోటీచేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఈనెల 12న జనసేన-బీజేపీ కలిసి స్థానికంగానే మేనిఫెస్టో రిలీజ్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ను లాంగ్మార్చ్ గురించి మీడియా ప్రశ్నించగా.. ఢిల్లీ ఎన్నికలు, ఇతర కారణాలతో లాంగ్మార్చ్ వాయిదా వేశామని వెల్లడించారు.