విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి నాటికి ఫ్లైఓవర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయవాడ– మచిలీపట్నం రోడ్డు నాలుగు వరుసలుగా విస్తరణకు రూ.740 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్కు రూ.82 కోట్లు కేటాయించారు. 1,450 మీటర్ల మేర 49 పిల్లర్లతో నిర్మించిన ఈ వంతెన పనులు 2016 నవంబర్లో మొదలయ్యాయి. దీని నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నారు. కానీ భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు, స్థానికుల నుండి ఆటంకాలు, అభ్యంతరాలతో ఆలస్యం అయింది. వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వంతెన నిర్మాణంపై దృష్టిసారించింది.
వీలైనంత త్వరగా ఈ ఓవర్ నిర్మాణం పూర్తయ్యేలా ఉండేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. స్థానికులు లేవనెత్తిన సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వారికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసింది. ఏలూరు వైపు అప్రోచ్ రోడ్ పనులు పూర్తయ్యాయి. దీన్ని ప్రధాన రహదారికి అనుసంధానించే ప్రక్రియ చేపట్టారు. అలాగే పకీరుగూడెం వద్ద 14 మీటర్ల వెడల్పుతో జరుగుతున్న అండర్పాస్ పనులు. అలాగే రిటైనింగ్ వాల్ కూడా పూర్తికావొచ్చాయి. మరో 20 రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఫ్లైఓవర్పై తారు రోడ్డు వేసి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. కాగా టీడీపీ హయాంలో ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు 40 శాతం పూర్తయింది.