ఆంధ్రా కశ్మీర్ లో ఊపందుకున్న యాపిల్ సాగు
ఆంద్రా కాశ్మీర్ లంబసింగిలో నోరూరించే యాపిల్ సాగు ఉపందుకుంది.
ఆంద్రా కాశ్మీర్ లంబసింగిలో నోరూరించే యాపిల్ సాగు ఉపందుకుంది. ఒక్కో మొక్కకు 20 నుంచి 30 యాపిల్స్ విరగ గాసిన దృశ్యాలు ప్రకృతి ప్రియులను కనువిందు చేస్తున్నాయి. కెంపయిన రంగుతో, ఇంపయిన సైజుతో, ఊరించే రుచులతో ఆకర్షిస్తోన్న ఈ యాపిల్స్ లంబసింగికి కొత్త అందాలను దిద్దుతున్నాయి.
లంబసింగిలో యాపిల్ సాగు అద్భుత ఫలితాలిస్తోంది. చింతపల్లి, జీకే వీధి మండలాల్లో గిరిజన రైతులు సాగుచేస్తున్న యాపిల్ మొక్కలు విరగగాస్తున్నాయి. దీంతో ఆంధ్రా కశ్మీర్ అంబసింగిలో అధిక మొత్తంలో యాపిల్ దిగుబడులు వస్తున్నాయి. గతేడాది ఒక్కొక్క మొక్క నుంచి ఐదు, ఆరు కాయలు రాగా... ఈ ఏడాది ఆ సంఖ్య 20 నుంచి 30కి పెరిగింది.
అరకు, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో యాపిల్ సాగు ఆశాజనకంగా ఉంది. ఐటీడీఏ పంపిణీ చేసిన మొక్కలన్నీ కాపుకొస్తున్నాయి. మరో రెండేళ్లలో అధిక దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రైతులు సాగుచేస్తున్న తోటల నుంచి ఉత్తమ ఫలితాలు వస్తే సాగు విస్తరణకు మరింత పెరిగే అవకాశం ఉంది.
2014లో లంబసింగి వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు ప్రారంభించగా... రెండేళ్ల క్రితం ఈ ఏజెన్సీ ప్రాంతం యాపిల్ సాగుకు అనుకూలమని నిర్ధారించారు. దీంతో పాడేరు ఐటీడీఏ అధికారులు సిమ్లా నుంచి అన్నా, డార్సెట్గోల్డ్ రకాల మొక్కలను తెప్పించి కొందరు రైతులకు వంద మొక్కల చొప్పున పంపిణీ చేశారు. ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు, గిరిజన వికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చింతపల్లి, జీకే వీధి మండలాల్లో గిరిజన రైతులకు యాపిల్ సాగుపై మెళుకువలు నేర్పారు. ఇప్పటికీ యాపిల్ సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీంతో యాపిల్ సాగు రానున్న కాలంలో మరింత ఫలితాలిస్తాయంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.