స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇవాళే
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ( శనివారం ) విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ( శనివారం ) విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ ప్రకటించారు. రాజకీయ పార్టీలతో తుది సంప్రదింపులు ముగిశాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈసీ కార్యాలయంలో పలు రాజకీయ పక్షాలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయని, ఏకాభిప్రాయం అందరిలోనూ తెచ్చేందుకు ఉద్దేశించిన సమావేశం కాదని ఆయన వెల్లడించారు. నిర్మాణాత్మక సూచనలను పరిగణలోకి తీసుకుంటునామని ఈసీ అన్నారు.
అంతకుముందు ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్లతో కలసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈవీఎంలతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదు కాబట్టి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి, దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పరీక్షలు జరుగుతున్న సమయంలో నిర్వహించడం ఇబ్బందని, కొన్ని పార్టీలు ఈ సమావేశంలో ప్రస్తావించాయి. ఈ నెల చివరి వారంలో జరగనున్న పదో పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈవీఎంలపై వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.