ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి భేటి అయ్యారు. టీడీపీని వీడి బీజేపీలో చేరుతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆది నారాయణరెడ్డి భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆది నారాయణ రెడ్డి వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నేతల్లో ఒకరిగా ఉన్న ఆది నారాయణరెడ్డి పార్టీనీ వీడుతారనే వార్తలు అటు టీడీపీలోనూ వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కడప జిల్లా జమ్ములమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మధ్యలోనే టీడీపీలో చేరి మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల మంత్రిగా విధులు నిర్వహించారు.