వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించిన సీఎం జగన్

Update: 2020-09-11 07:26 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి 'వైఎస్సార్‌ ఆసరా' పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ... ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయని, నాలుగు విడతల్లో 'వైఎస్సార్‌ ఆసరా' ద్వారా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు. అలాగే పీ అండ్ ‌జీ, హెచ్‌యూఎల్‌ లాంటి మల్టీనేషనల్‌ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామ‌ని, పసిపిల్లల నుంచి బామ్మ‌ల వరకు అంద‌రికీ ప్ర‌యోజ‌నాలు చేకూరేలా తాము సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామ‌ని చెప్పారు.

అమ్మ ఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని ఆయ‌న తెలిపారు. ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామ‌ని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్ల బకాయిలను తాము చెల్లించామ‌ని తెలిపారు. అలాగే, హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల కోసం తాము వసతి దీవెన అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. కొంద‌రు కుట్రపూరితంగా ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ తాము త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని భ‌రోసా ఇచ్చారు.



Tags:    

Similar News