నారా లోకేష్ ట్వీట్ కి స్పందించిన వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ వైసీపీ, టీడీపీ నాయకులు మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ వైసీపీ, టీడీపీ నాయకులు మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.. కరోనా ప్రభావంతో ఆలయాలకు భక్తులను అనుమతించడం లేదన్న సంగతి తెలిసిందే.. అయితే ప్రస్తుత లాక్ డౌన్ వేళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారని తెలుగు దేశంపార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ శనివారం ట్వీట్ చేశారు. సాధారణ భక్తులకు లేని దర్శనం వైఎస్ తోడల్లుడు వచ్చేసరికి ఎలా తలుపులు తెరుచుకున్నాయనిఈ సందర్భంగా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
"ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శనభాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా! దేవదేవుడు ఉత్సవాలతో అలరారిన తిరుమలగిరులు నిర్మానుష్యంగా మారినవేళ నిబంధనలు తుంగలోతొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు.. నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ! " అంటూ లోకేష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
అయితే దీనిపైనే వైవి సుబ్బారెడ్డి స్పందించారు.."ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఒక సారి TTD ఛైర్మన్ హాజరు కావటం ఆనవాయితీ. నేనూ అలాగే వెళ్లాను. నా తల్లిగారు, నా సతీమణి తప్ప బంధువులు ఎవ్వరూ లేరు.ఫొటోలో ఉన్నది అందరూ టీటీడీ ఉద్యోగులు. నీ ట్వీట్ అబద్ధం. కొంచమైనా పాపభీతి ఉండాలి.తప్పు తెల్సుకో."అంటూ ట్వీట్ చేశారు వైవీ సుబ్బారెడ్డి.