అణచి వేయడానికి ఆర్టీసీ ఉద్యమం కాదు..ఆత్మగౌరవ ఉద్యమం : టీడీపీ నాయకులు
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అనే అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్ కు కితాబునిచ్చారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం మంచి నిర్ణయమే అని వ్యాఖ్యానించారు. దీంతో గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ తీసుకుంది అంత గొప్ప నిర్ణయమైతే అదే నిర్ణయాన్ని తెలంగాణలో కూడా అమలు చేయండి అంటూ మండిపడ్డారు. తెలంగాణలో మూడు రాజధానులు ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించారు.
అంతే కాక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6గంటల పాటు ఏం చర్చించుకున్నారో, ఆ చర్చల వల్ల ఆంధ్ర ప్రదేశ్ కు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఆర్థిక పరంగా నష్టపోతుందని, ఆ దురుద్దేశంతోనే కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానిచారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకు కేసీఆర్ డబ్బు సహాయం చేసాడని అందుకు కృతజ్ఞతగా విజయసాయిరెడ్డి కేసీఆర్ కాళ్ళకు మొక్కాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. కేసీఆర్ కాళ్లపై పడడం, సాష్టాంగ నమస్కారాలు, పొర్లు దండాలు పెట్టడం ఏ1, ఏ2లకు కొత్తేమి కాదని ఆయన ఎద్దేవా చేశారు. భూకబ్జాలు, సెటిల్మెంట్లు, దందాల కోసం మంత్రి అవంతి శ్రీనివాస్, కేసుల మాఫీ కోసం ఎంపీ విజయసాయిరెడ్డి కాళ్లబేరంలో పోటీ పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు.
జగన్ ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయిన నాటి నుంచి షాడో బాస్గా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఇది తెలుగు వారి అత్మగౌరవ ఉద్యమం, దాన్ని అనచివేయడానికి ఇదేమీ తెలంగాణలో జరిపిన ఆర్టీసీ ఉద్యమం కాదని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు అన్నారు.