విశాఖ ఎల్జీ పాలిమర్స్ను స్టైరిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 12మంది చనిపోగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేసి ఉంచాలని అధికారులను ఆదేశించింది. అదే విధంగా కంపని లోపలకి ఎవరిని అనుమతించ వద్దని కోర్టు తెలిపింది. గ్యాస్ లీక్ దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈ మేరకు విచారణకు సంబంధించి నేడు ఆదేశాలను జారీ చేసింది.
ఎల్జీ పాలిమర్స్, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వారి వాదనలు న్యాయస్థానానికి వినిపించారు. వాదనలను విన్న న్యాయస్థానం గ్యాస్ లీకేజీ జరిగిన తర్వాత స్టైరీన్ను ఎవరి అనుమతితో తరలించారని.. ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని న్యాయస్థానం ప్రశ్నించింది. అదేవిధంగా పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం లిఖతపూర్వక ఆదేశాలను జరీ చేసింది.
ఇప్పటికే ఈ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. అదేవిధంగా అక్కడి నివాసితులకు ఆర్ధిక సహాయాన్ని భారీగా అందించింది. అయితే, స్థానికులు ఈ ఘటనతో అక్కడి నుంచి సంస్థను తరలించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కీలకంగా మారాయి.