ఏపీ గవర్నర్ విరాళం.. కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు
దేశంలో కరోనాపై పోరుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విరాళాన్ని ప్రకటించారు.
దేశంలో కరోనాపై పోరుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విరాళాన్ని ప్రకటించారు. ఆయన తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ప్రజలు మరింతగా సహకరించాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, స్వీయ నిర్భందంలో ఉండాలని సూచించారు. ''21 రోజుల పాటు లాక్డౌన్ను ప్రజలందరూ పాటించాలి. ఈ వైరస్ ప్రపంచ దేశాలకూ వ్యాపించిందని డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ ఇతర దేశాలనుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు పాటించాలని, నిరాశ్రయులు శిబిరాలకు వెళ్లాలని '' అని గవర్నర్ అన్నారు.
అంతకుముందు సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు జగన్. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్డౌన్ పరిస్థితులను సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. కరోనా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం జగన్ శానిటైజర్తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. అలాగే సమావేశంలో కూడా గవర్నర్, సీఎం జగన్లు సామాజిక దూరం పాటించారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 23 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.