మంచినీళ్లు అనుకుని జిల్లా వైద్యాధికారి శానిటైజర్ తాగారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) అనిల్ కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్ను రెండు గుటకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకొన్న పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు ఆయనను పరామర్శించారు. అనంతపురం జిల్లాలో కూడ కరోనా పాజిటివ్ కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కాగా అధికారి శానిటైజర్ తాగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ప్రమాదవశాత్తు ఆయన శానిటైజర్ తాగారా..? లేక కావాలనుకునే తాగారా..? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.