Anandayya Ayurvedic Medicine: ఇవాళ్టి నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ

Anandayya Ayurvedic Medicine: నేడు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందు సరఫరా

Update: 2021-06-07 05:56 GMT

ఆనందయ్య మందు పంపిణి (ఫైల్ ఇమేజ్)

Anandayya Ayurvedic Medicine: ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ ఇవాళ ప్రారంభం కానుంది. కృష్ణపట్నంలోని సీవీఆర్‌ ఫౌండేషన్‌ ప్రాంగణంలో కరోనా నివారణ మందును పంపిణీ చేయనున్నారు ఆనందయ్య. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మందు పంపిణీ జరగనుంది. మందు తీసుకునేందుకు వచ్చినవారు పక్కా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు అధికారులు. సర్వేపల్లి ప్రజలందిరికీ మందు సరఫరా అయిన కొన్నాళ్ల తర్వాత మిగతా ప్రాంతాలవారికి మందు ఇవ్వనుంది ఆనందయ్య టీమ్.

మరోవైపు.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కృష్ణపట్నంకు కరోనా బాధితులు, వారి బంధువులు భారీగా చేరుకుంటున్నారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు మాత్రమే మందు పంపిణీ ఉంటుందని ఆనందయ్య ప్రకటన చేసినప్పటికీ ఏదొక విధంగా మందును తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, బయటవారెవరూ రాకుండా చర్యలు చేపట్టారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్‌ విధించారు.

ఇంకోపక్క.. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కృష్ణపట్నం పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి. తమ జోలికి వస్తే ఊరుకోమని సోమిరెడ్డిని ఆయన హెచ్చరించారు. సోమిరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తక్షణమే కేసు విత్‌ డ్రా చేసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News