నెల్లూరు జిల్లాలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొండబిట్రగంట బిలకూటమిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిఆలయంలోని స్వామి వారి రథంను దగ్ధం చేశారు. రాజకీయ కక్షలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఘటనకు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మరోవైపు కొండబిట్రగంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 5 నుంచీ వారం పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.