రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Update: 2021-02-12 14:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు జరగనున్న పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం మూడున్నర వరకు ఓటింగ్‌ జరగనుంది. పోలింగ్ అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

రెండో విడత కింద 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో 3వేల 328 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇందులో 539 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 2వేల 789 సర్పంచ్ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో 7వేల 510మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, 20వేల 817వార్డు స్ధానాలకు 44వేల 876మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

మరోవైపు మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. మూడో దశలో ఎన్నికలు జరిగే వాటిలో 3వేల 249 పంచాయతీలు, 32 వేల 502 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈనెల 17న మూడో దశ పోలింగ్ జరగనుంది. సర్పంచ్ స్థానాల కోసం 17వేల 447 నామినేషన్లు వస్తే వార్డు మెంబర్ల కోసం 77వేల 447 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇక నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా ఇవాళ్టితో ముగిసింది. నిన్న అమావాస్య కావడంతో నామినేషన్లు మందకొడిగా దాఖలయ్యాయి. నాలుగో విడత పోలింగ్ జరిగేవాటిలో 13 జిల్లాల్లోని 3వేల 299 పంచాయతీలు, 33 వేల 434 వార్డు స్థానాలున్నాయి. నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 21న జరుగనుంది.

Tags:    

Similar News