ఇవాళ ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వీటిపై చర్చ జరిపి సభ్యులు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల రైతులకు ప్రయోజనం చేసేలా ప్రత్యేక బోర్డుల ఏర్పాటు వంటి పలు రంగాల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఆర్టీసీ సమస్య నేటితో తీరిపోనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు అబ్జార్పషన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీసు యాక్ట్ - 2019' బిల్లును రవాణా మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. దీనిపై చర్చ జరిపి ఆమోదించనుంది. అంతేకాదు మద్యం అధిక ధరలకు విక్రయించేలా అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేసే బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21–ఎ (1) (ఇ) సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టంలో సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ చట్టంలో సవరణ బిల్లు,
ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తిని అన్ని యూనివర్సిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించేలా చట్ట సవరణ, అంతేకాదు కడప జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటుకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చట్టంలో సవరణ చేసేలా చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడతారు. ఇక కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయడానికి వీలుగా యూనివర్సిటీ చట్టంలో సవరణ చేస్తారు.