Nidadavole: నిరుపేద వైద్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత మంత్రి కందుల దుర్గేష్!
Nidadavole: నిడదవోలులో 45 మంది లబ్ధిదారులకు రూ.48.39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్.
Nidadavole: నిరుపేద వైద్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత మంత్రి కందుల దుర్గేష్!
Nidadavole: నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 48,39,268 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను మంత్రి దుర్గేష్ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ..ఇవాళ 39 మందికి రూ. 25,53,383 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఆరుగురికి రూ. 22,85, 886 విలువైన ఎల్వోసీ పత్రాలు అందించామన్నారు. "నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ, ప్రత్యేక ఆర్థిక సాయం ద్వారా మొత్తం 1092 మంది బాధితులకు రూ. 7,66,07,826 ఆర్థిక లబ్ధి చేకూర్చాం."అని మంత్రి కందుల దుర్గేష్ వివరాలు వెల్లడించారు. "ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా ఈ ఆర్థిక సాయం అందజేస్తున్నాం."
అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.తీవ్ర అనారోగ్యం, అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా సీఎంఆర్ఎఫ్ భరోసానిస్తోందని, కార్పొరేట్ వైద్యం పేదవాడికి భారం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తోంది అని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. బాధితుల కళ్ళల్లో నిండిన ఆనంద భాష్పాలే... ఈ ప్రభుత్వ పాలనకు నిజమైన ఆశీస్సులు అని అన్నారు.
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.. కేంద్ర సహకారంతో హెల్ది వెల్ది హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు బాటలు వేస్తున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వంలో సహాయం పొందుతున్న ప్రతి లబ్ధిదారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
సకాలంలో నిధులు విడుదల చేస్తూ పేదలను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆపత్కాలంలో తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకున్నందుకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులు, మంత్రి దుర్గేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




