Nidadavole: వేద పండితులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్!
Nidadavole: నిడదవోలులో 10 మంది వేద పండితులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని వెల్లడి.
Nidadavole: వేద పండితులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్!
Nidadavole: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన వేద పండితులకు నిడదవోలులోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నియామక పత్రాలను అందజేశారు.
టిటిడి నిర్వహించిన వేద పారాయణ స్కీమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 741 మంది వేద పండితులను ఎంపిక చేయగా.. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేద నిష్ణాతులైన 10 మంది పండితులు ఈ నియామక పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రి కందుల దుర్గేష్ కి వేదాశీర్వచనం అందించి ఘనంగా సత్కరించారు.
కూటమి ప్రభుత్వం పురోహిత, అర్చక, దేవాలయ వ్యవస్థల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పండితులు పేర్కొన్నారు. ఇటీవల టిటిడి ద్వారా రూ.791 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని వేద విద్యార్థులు, పండితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పారదర్శకంగా పోస్టులను భర్తీ చేయడం అభినందనీయమని వారు కొనియాడారు.అందుకు మంత్రి కందుల దుర్గేష్ కు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
2027 జూన్ 26 నుండి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుండటంపై వేద పండితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం పరిధిలోని తీపర్రు వద్ద పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పుష్కరాల సమయంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు పూజా కార్యక్రమాలు, పిండ ప్రదానాలు నిర్వహించేందుకు నిడదవోలు పరిసర ప్రాంతాలలోని 80 గ్రామాల పురోహితులకు తగిన వసతి మరియు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని పండితులు మంత్రి దుర్గేష్ కు వారు విన్నవించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ ల నాయకత్వంలో ప్రజలకు సుభిక్షమైన, పారదర్శకమైన పరిపాలన అందుతోందని ఈ సందర్భంగా వేద పండితులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక పురాతన ఆలయాల నిర్మాణానికి, పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు. పుష్కరాల సందర్భంగా పురోహితులకు అవసరమైన వసతి షెడ్ల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




