Station Ghanpur: పాలిటెక్నిక్ అధ్యాపకుల ఆందోళన కమిషనర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

Station Ghanpur: స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాలిటెక్నిక్ అధ్యాపకుల ఆందోళన. కమిషనర్ దురుసు వ్యాఖ్యలపై నిరసన, జీవో 97 రద్దు చేయాలని డిమాండ్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 16 Sept 2026 4:42 PM IST
Station Ghanpur
X

Station Ghanpur: పాలిటెక్నిక్ అధ్యాపకుల ఆందోళన కమిషనర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్ అధ్యాపకుల సమస్యలను చర్చించేందుకు కమిషనర్‌ను కలిసిన జేఏసీ ప్రతినిధులతో కమిషనర్ దురుసుగా, నిరంకుశంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. కమిషనర్ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకుని, పాలిటెక్నిక్‌లోని అధ్యాపకులు, సిబ్బందికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

15 సెప్టెంబర్ 2026న జీవో 97 రద్దు, సాంకేతిక విద్యాశాఖ విలీనానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ తమతో “మీకు బుద్ధి లేదు, చదువు రాదు, బుర్ర లేదు” అంటూ మాట్లాడారని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. అధ్యాపకుల సమస్యలను చర్చించాల్సిన సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అధికారిక హోదాకు తగిన విధానం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ 31వ రోజు లంచ్ అవర్ ప్రొటెస్ట్‌లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. కమిషనర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, పాలిటెక్నిక్‌లోని అందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

జీవో 97 రద్దుపై స్పష్టమైన నిర్ణయం కావాలి

అదే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని అధ్యాపకులు మరోసారి డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యాశాఖను విలీనం చేసే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించి, శాఖను యథావిధిగా కొనసాగించాలని కోరారు. సాంకేతిక విద్యాశాఖను విద్యాశాఖ పరిధిలోనే ఉంచాలని స్పష్టం చేశారు.

జీవో 97పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే, దాని ప్రభావం విద్యార్థులపై పడే అవకాశం ఉందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అధ్యాపకులతో చర్చలు జరిపి, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కమిషనర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పడం, జీవో 97ను రద్దు చేయడం తమ ప్రధాన డిమాండ్లని జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో లోకల్ జేఏసీ అధ్యక్షుడు సీహెచ్‌ యాదయ్య, జనరల్ సెక్రటరీ అశోక్, ప్రిన్సిపల్ గంగారెడ్డి, సెంట్రల్ జేఏసీ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ధనుంజయ్, శ్రీధర్‌రెడ్డి, శ్రీకర్, కిరణ్‌కుమార్, సంపత్‌కుమార్, రవీందర్, సుకన్య, అనిల్‌కుమార్, రాజు, జావేద్‌పాషా, నరేష్, ప్రశాంత్, రామ్‌ నర్సయ్య, సిద్ధులు, పోతరాజు, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON