Mulugu: మీ-సేవా కేంద్రాల నిర్వాహకులకు అదనపు కలెక్టర్ హెచ్చరిక
Mulugu: ములుగు జిల్లాలో మీ-సేవా కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ మహేందర్ జీ సమావేశం నిర్వహించి, అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Mulugu: మీ-సేవా కేంద్రాల నిర్వాహకులకు అదనపు కలెక్టర్ హెచ్చరిక
ములుగు: ములుగు జిల్లాలోని మీ-సేవా కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన సేవలను అందించాలని శ్రీ సిహెచ్. మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ములుగు గారు, మీ-సేవా నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు.
మీ-సేవ సేవల పేరుతో ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే అధికంగా వసూలు చేయడం, అనధికార మధ్యవర్తిత్వానికి పాల్పడటం, ప్రజల నుంచి అధిక మొత్తాలను వసూలు చేయడం వంటి చర్యలను ఇకపై ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు.
ఫిర్యాదు వస్తే విచారణ – నిరూపితమైతే శాశ్వత రద్దు:
మీ-సేవా కేంద్రంపై అధిక రుసుముల వసూళ్లు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపడతామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ములుగు తెలిపారు. విచారణ సమయంలో అవసరమైతే సంబంధిత కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తామని, ఆరోపణలు నిజమని తేలితే మీ-సేవా ఫ్రాంచైజీ/అనుమతిని శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మీ-సేవా కేంద్రాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసినవని, వాటి విశ్వసనీయతను కాపాడే బాధ్యత ప్రతి మీసేవ కేంద్ర నిర్వాహకుడి పై ఉందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ములుగు తెలిపారు. ప్రజల పట్ల బాధ్యతతో, నిజాయితీతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలు అందించాలని వారు సూచించారు.
మీసేవ కేంద్రాలను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఎలక్ట్రానిక్స్ సర్వీస్ డెలివరీ (ESD) గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపవలనని సూచించారు. ప్రజలతో ప్రతి సందర్భంలోనూ మర్యాదపూర్వకంగా, సహనంతో మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని సూచించారు.
ప్రజల పట్ల దురుసు ప్రవర్తన లేదా అనుచిత ప్రవర్తనకు సంబంధించి పునరావృత ఫిర్యాదులు వచ్చినట్లయితే వాటిని తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోబడతాయి.మీసేవ కేంద్రాన్ని సాంకేతిక లేదా వ్యతిగతమైన కారణాల వలన తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేయాల్సి వస్తే ముందస్తుగా జిల్లా పరిపాలనకు సమాచారం అందించాలి. ముందస్తు సమాచారం లేకుండా కేంద్రాలను మూసివేయడం తీవ్రంగా పరిగణించబడుతుందని అదనపు కలెక్టర్ ఆదేశించారు .
మీసేవ మరియు ఆధార్ సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చాప్టర్, భూభారతి కి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, మరియు తహసిల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవలెన ని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
కళ్యాణ లక్ష్మి, UDID(సదరం), బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మరియు మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల సున్నితంగా ఉంటూ వారికి మీసేవ సర్వీసులను మరియు ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు.
మీ సేవ VLEలు ESD/మీ సేవ మార్గదర్శకాల ప్రకారం తమ కేంద్రాలను తప్పనిసరిగా నిర్వహించాలి. కేంద్రాల్లో క్రింది సౌకర్యాలు మరియు అంశాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి:
1. సిటిజన్ చార్టర్ / నూతన రేట్ చార్ట్ తప్పనిసరిగా ప్రదర్శించాలి.
2. మీ సేవ అధికారిక లోగోలు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలి.
3. భూభారతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి.
4. కేంద్రంలో పవర్ బ్యాకప్ సౌకర్యం ఉండాలి.
5. ప్రజల సౌకర్యార్థం తగినన్ని కుర్చీలు మరియు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి.
6. కేంద్రానికి సంబంధించిన నేమ్ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
7. మీ సేవ కేంద్రాల్లో నిర్దేశించిన మీ సేవ ప్రత్యేక రంగులను మాత్రమే ఉపయోగించాలి.
8. పరిష్కారం కాల్ సెంటర్ 1100, సంబంధిత తహసీల్దార్ మరియు EDM సంప్రదింపు నంబర్లను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలి.
9. కేంద్రంలో తగిన వేగంతో పనిచేసే బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సౌకర్యం ఉండాలి.అలాగే, అన్ని ఆధార్ కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లోనే నిర్వహించాలి అని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపర్డెంట్ శివకుమార్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ మరియు మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ మరియు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.




