Mahabubabad: ఎక్సైజ్ అధికారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తీరుపై మనస్తాపం చెంది దంపతుల ఆత్మహత్యాయత్నం. కులం పేరుతో దూషించారని బాధితుల ఆరోపణ.
Mahabubabad: ఎక్సైజ్ అధికారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న యాకయ్య, ఆయన భార్య స్వాతి వద్దకు తోర్రూర్ ఎక్సైజ్ శాఖ అధికారులు వెళ్లినట్లు సమాచారం. అయితే షాప్ నిర్వాహకుడిని కులం పేరుతో దూషించారని, షాప్కు సంబంధించిన సుమారు రూ.40 వేల విలువైన మద్యం బాటిళ్లను తీసుకెళ్లారని బాధితులు ఆరోపించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్యాభర్తలు నరసింహులపేటలోని మధుర వైన్స్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వైన్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
వైన్స్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు
ఇదిలా ఉండగా.. ఒక్క క్వార్టర్ మద్యం బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులు, బాధితులు ఆరోపిస్తున్నారు.
అధికారులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్న సమయంలో.. వైన్స్లలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎక్సైజ్ అధికారుల తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని, కులం పేరుతో దూషించినట్లు వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




