Kesamudram: విద్యార్థి సమస్యలపై రేవంత్ నిర్లక్ష్యం.. బీజేపీ వినూత్న నిరసన!
Kesamudram: విద్యార్థుల సమస్యలను సీఎం రేవంత్ పట్టించుకోవడంలేదని కేసముద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు.
Kesamudram: విద్యార్థి సమస్యలపై రేవంత్ నిర్లక్ష్యం.. బీజేపీ వినూత్న నిరసన!
Kesamudram: తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న న్యాయమైన, దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించకపోవడాన్ని, ఆయన అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని బీజేపీ కేసముద్రం మండల శాఖ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల హక్కుల సాధన కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా, రెండవ రోజున స్థానిక నాయకత్వం ఒక వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
బీజేపీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. విద్యార్థుల అపరిష్కృత సమస్యలపై కళ్లు మూసుకున్న ఈ మొండి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూడాలని ఆ మహానీయుడిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఉప్పునూతల రమేష్ విలేకరులతో మాట్లాడుతూ, విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో సమస్యలపై ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల శాఖ తరఫున సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, ముదిరెడ్డి మురళీధర్ రెడ్డి, మంగిశెట్టి నాగయ్య, శీలం శ్రీనివాస్, బానోత్ సంపత్, బానోత్ యాకూబ్, ఎలుబోయిన కరుణాకర్, చిత్తూజు చక్రధర్, కొండ్రెడ్డి వీరారెడ్డి, వల్లందాస్ నగేష్, వేల్పుల ఐలయ్య, తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.




